Sunday, June 30, 2013

" ఎంగుమే ఆనందం, ఆనందమే జీవనిన్ మకరంధం"

1953  లో వచ్చిన "బ్రతుకు తెరువు" చిత్రాన్ని తమిళంలో "భలే రామన్" పేరుతో అనువాదం చేసి విడుదల చేసారు. తమిళం లో కూడా విజయం సాధించింది.  అక్కినేని పియానో ఫై  పాడిన పాట అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం ఒక గొప్ప మెలోడీ పాట. ఘంటసాల మాస్టారు స్వర పరచి పాడారు.  ఘంటసాల గారికి ఎంతో ఇష్టమైన పాటగా చెప్పుకొంటారు.  మాస్టారు ఎక్కడ కచేరి చేసినా  ఈ పాటతో మొదలుపెట్టి,  దేవదాసు చిత్రంలోని జగమే మాయ తో ముగించేవారని చెప్పగా విన్నాను.  భలే రామన్ చిత్రంలో లోని పాట " ఎంగుమే ఆనందం, ఆనందమే జీవనిన్ మకరంధం" కూడా ఘంటసాల మాస్టారు అంతే అందంగా, స్వచ్చంగా పాడారు. మాస్టారు కు తమిళం రాక పోయినా, పాటలోని చరణాలను ఆయన గళం అద్భుతంగా పలికింది. అది ఘంటసాల గారి గొప్పతనం. ఆ పాట విందాము. 

Friday, June 28, 2013

"విన్న వించు కోన చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక".

Bangaru Gajulu.JPG    ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం తో నా ఈ బ్లాగ్ ను 2012 లో ప్రారంభించాను.  ఈ బ్లాగ్ ప్రారంభానికి సహాయ పడ్డ శ్రీ వులిమిరి సూర్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు.   ఇది నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్న 100 వ పాట. నా బ్లాగ్ ను చూసి  ఆదరిస్తున్న దేశ  విదేశాల ఘంటసాల అభిమానులందరికీ నా ప్రత్యెక కృతజ్ఞతలు.
ఘంటసాల మాస్టారు లేరు అన్నది అబద్ధం. వారి పాటల ద్వారా మనలోనే ఉన్నారు . వారు చిరంజీవులు. ఆయన పాడిన  పాటలకు మరణం లేదు. అవి అజరామరం.

రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "బంగారు గాజులు".  ఈ చిత్రం 1968 లో విడుదలై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ "నంది" అవార్డు పొందింది. అక్కినేని, భారతి, విజయ నిర్మల నటించగా, శ్రీ సి యస్ రావు దర్సకత్వం వహించారు. సంగీతం శ్రీ తాతినేని చలపతి రావు. ఈ చిత్రం లో 7 పాటలు ఉన్నాయి. అందులో ఘంటసాల, సుశీల గారలు  పాడిన  మంచి మెలోడీ పాట "విన్న వించు కోన చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక". విన్నంత సేపు ఎంతో హాయిగా ఉంటుంది. గీత రచన శ్రీ దాశరథి కృష్ణమాచార్య.  ఆ పాట వీడియో క్లిప్పింగ్ చూద్దాము.


Wednesday, June 26, 2013

"కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయి" .


 Devadasu 1953.JPG
ఘంటసాల మాస్టారు అనుభవించి పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. అందులో  చెప్పుకో తగ్గది "దేవదాసు"  చిత్రంలోని దాదాపు అన్ని పాటలు. చిత్ర విజయానికి ఆయన పాడిన పాటలు ఎంతో దోహదం చేశాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.  ఆ పాటలన్నీ ఆణిముత్యాలే.  వినోదా బ్యానర్ లో శ్రీ డీ.యల్.నారాయణ నిర్మించిన చిత్రం " దేవదాసు"  విడుదలై నేటికి 60  సంవత్సరాలు నిండినవి. ఈ చిత్రం 23-06-1953 రోజున విడుదలైంది.  నేటికినీ, ఆ పాటలు ప్రజల మనోఫలకం ఫై నిలిచి ఉందంటే, ఆ శక్తి ఘంటసాల గారిదే. అక్కినేని, సావిత్రి ల అసమాన నటన, సీ.ఆర్. సుబ్బరామన్ అద్భుత సంగీతం, శ్రీ సముద్రాల మాటలు-పాటలు, శ్రీ వేదాంతం రాఘవయ్య దర్సకత్వ ప్రతిభ, శ్రీ బి.ఎస్. రంగ ఛాయాగ్రహణం,  అన్నిఅలా కలిసి వచ్చి చిత్ర విజయానికి పీటలు వేశాయి. ఈ చిత్రం లో ఘంటసాల మాస్టారు పాడిన "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయి" ఒక మంచి సింబాలిక్ పాట.ఈ పాటకు అర్థం ఏమిటని అడిగితే, సముద్రాల గారు చెప్పారట-- దేవదాసు పార్వతిని ప్రేమించాడు, ఆమె దక్కలేదు, చంద్రముఖి దేవదాసు ను ప్రేమించింది కానీ దేవదాసు వద్దన్నాడు.  కుడి ఎడమైనా పరవాలేదు అంత మాత్రాన ఓడి పోలేదు. త్రాగుడుకు  బానిస అయ్యాడు.  మేడ  మీద అలపైడి  బొమ్మ (పార్వతి), నేలనే చిలక్కమ్మ (చంద్రముఖి),  చందమామ మసక వేసే ముందు, కబురేల, అవసరం లెదు. ప్రాణం మీద తీపి ఉన్న వానికి లంగరు అవసరం కాని, చావాలని అనుకొన్న వానికి లంగారు  అవసరం లేదు, లాహిరి నది సంద్రంలోన లంగరు తో పనిలేదోయి , మునకే సుఖ మను కోవోయి. ఎంత సింబాలిక్ గా వ్రాసారు సీనియర్ సముద్రాల గారు. అందుకే ఆ పాట అలా నిలిచిపోయింది. ఆ పాట విందాము. 


Friday, June 21, 2013

"కావన గానే సరియా ..ఈ పువ్వులు నీ వేగా ... దేవీ ....చల్లగ చూడాలి పూలను అందుకో పోవాలి"

Pellinati Pramanalu.jpgజయంతి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "పెళ్ళినాటి ప్రమాణాలు".  ఈ చిత్రం 17-12-1958 లో విడుదలై విజయం సాదించిన చిత్రం.  దర్శక-నిర్మాత శ్రీ K V రెడ్డి గారు.  కథ-మాటలు -పాటలు
శ్రీ పింగళి నాగేంద్ర రావు.  సంగీతం ఘంటసాల మాస్టారు. ఈ చిత్రంలో 9 పాటలు ఒక పద్యం ఉంది. అన్ని పాటలు మంచి బాణీలు కలిగి వినడానికి ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి.  అన్నీ మెలోడీ పాటలే.  వాటిల్లో ఘంటసాల గారు పాడిన "కావన గానే సరియా ..ఈ పువ్వులు  నీ వేగా.... దేవీ ....చల్లగ చూడాలి పూలను అందుకో పోవాలి" ఒక చక్కని పాట. ఆ పాటకు దారి తీసిన
దృశ్యం తో పాటు ఆ పాటను విందాము. వీడియో యూ ట్యూబ్ సౌజన్యంతో.




" అదే .. అదే.. అంతు తెలియకున్నది ఏదో లాగు మనసు లాగుతున్నది "



Ramudu Bheemudu.jpgసురేష్ ప్రొడక్షన్స్ వారి "రాముడు భీముడు", నిర్మాత గా  రామానాయుడు గారికి తొలి చిత్రం.  ఈ చిత్రం 1964 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందింది.  తాపి చాణక్య, దర్శకుడు, శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్సకుడు.  చిత్రంలోని అన్ని పాటలు విశేష ప్రజాదరణ పొందినవే.  ఘంటసాల సుశీల తో పాడిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్.  డాక్టర్ సి నారాయణ రెడ్డి వ్రాసిన " అదే .. అదే.. అంతు తెలియకున్నది  ఏదో లాగు మనసు లాగుతున్నది " మంచి మెలోడీ పాట.  ఆ పాట విందాము, వీడియో యూ ట్యూబ్ సౌజన్యంతో. 

Wednesday, June 19, 2013

"నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనీరా"

  మనసు కవి "ఆచార్య ఆత్రేయ" నిర్మించి, దర్సకత్వం వహించిన చిత్రం "వాగ్ధానం. ఈ చిత్రం 1961 లో విడుదలై సంగీత పరంగా విజయం సాధించింది.   శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్శకుడు. మంచి బాణీలు సమకూర్చి అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంతో  శ్రీ దాశరథి సినీ రంగ ప్రవేశం చేసారు. ఆయన వ్రాసిన 
"నా కంటి పాపలో నిలిచిపోరా,  నీ వెంట లోకాల గెలవనీరా" ఒక అద్భుత యుగళ గీతం. ఘంటసాల మాస్టారు, సుశీల పాటకు ప్రాణం పోసారు.  పాట చిత్రీకరణ కూడా చాల బాగుంది. పాట వింటూ ఉంటె, మనం కూడా ఏదో లోకంలో విహరించినట్టు ఉంటుంది.  అంత మహిమ ఆ పాటలో ఉంది. ఆ పాట విందాము. 


Sunday, June 16, 2013

"నీ అనురాగమే, నిఖిలా వని నిండెనులే"


ఘంటసాల పాట మధురంగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం.  1955 లో వచ్చిన "వదిన గారి గాజులు".  అమర్ నాథ్, చలం,అంజలి తారాగణం.  దోనేపూడి కృష్ణమూర్తి నిర్మాత, శ్రీ రజనీకాంత్ దర్శకుడు.  సంగీతం శ్రీ ఘంటసాల. ఈ చిత్రం లో ఆయన పాడిన "నీ అనురాగమే, నిఖిలా వని నిండెనులే" చాలా అరుదుగా వినిపించే పాట.  ఎంత మధురంగా పాడారంటే, ఎక్కడో ఊహా లోకంలో విహరించి నట్టు ఉంటుంది. పాట ఆస్వాదించే లోపలే అది ముగుస్తుంది.     గమనిక: పాట క్లిప్పింగ్ రాక  పోతే, యు ట్యూబ్ ఆప్షన్ నొక్కి, పాట వినగలరు.

"మ్రోగింది గుడిలోని ఘంట"


ఘంటసాల మాస్టారు ఏ పాట పాడినా, ఎవ్వరికి పాడినా, వంద శాతం న్యాయం చేకూరుస్తారు అనడం అతి శయోక్తి  కాదు. పాట అయినా, పద్యం అయినా, సోలో లేక యుగళ గీతం అయినా మాస్టారు పాడితే ఒక నిండు తనం వస్తుంది. 
కాంతారావు, శారద నటించిన చిత్రం "శ్రీమతి" ( ఈ చిత్ర వివరాలు లభ్యం కాలేదు). ఈ చిత్రంలో మాస్టారు, సుశీల గారితో పాడిన "మ్రోగింది గుడిలోని ఘంట" మంచి మెలోడీ పాట. వింటూ ఉంటె ఎంతో హాయిగా ఉంటుంది . ఆ పాట విందాము.


"చెప్పాలని ఉంది దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది"

శ్రీ N A T సంస్త నిర్మించిన చిత్రం "ఉమ్మడి కుటుంబం". శ్రీ నందమూరి తారక రామారావు, సత్యనారాయణ, సావిత్రి, కృష్ణకుమారి, వాణిశ్రీ నటించిన ఈ చిత్రం 1967 లో విడుదలై ప్రజాదరణ పొందింది. చిత్ర దర్శకుడు యోగానంద్, సంగీత దర్శకుడు T V రాజు. అన్ని పాటలు బాగున్నాయి.  ఘంటసాల మాస్టారు ఏ పాట పాడినా వంద శాతం న్యాయం చేకూరుస్తారు. సినారె వ్రాసిన పాట "చెప్పాలని ఉంది  దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది", ఘంటసాల మాస్టారు, సుశీల యుగళ గీతం. మంచి మెలోడీ, మెల్లగ సాగే పాట. ఆ పాట విందాము. 


Friday, June 14, 2013

"ఆకాశ వీధిలో అందాల జాబిలీ"

అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించిన తృతీయ చిత్రం "మాంగల్యబలం".  07-01-1959 లో విడుదలై విజయం సాధించిన చిత్రం.  కథా బలం, మంచి సంగీతం, అక్కినేని, సావిత్రి, యస్.వీ. రంగా రావు, కన్నాంబ, సూర్యకాంతం, రేలంగి, రాజసులోచన, మొదలగు నటీ నటుల అద్భుత నటన చిత్ర విజయానికి దోహదం చేశాయి. చిత్ర దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బా రావు, సంగీతం మాస్టర్ వేణు. ఈ చిత్రంలోని అన్ని పాటలు బహుళ ప్రజాదరణ పొందినవే. ఆ పాటలన్నీ పాత మధురాలే . శ్రీ శ్రీ కలం నుండి జాలు వ్రాలిన "ఆకాశ వీధిలో అందాల జాబిలీ" మంఛి మెలోడీ పాట.
ఆ పాట క్లిప్పింగ్ చూద్దాము. వీడియో "తెలుగు వన్" వారి సౌజన్యంతో. 



Thursday, June 13, 2013

"శ్రీ నగజా తనయం సహృదయం" (హరికథ) "వాగ్ధానం".

శరత్ నవల "దత్త" (వాగ్దత్త) ఆధారంగా తీసిన చిత్రం "వాగ్ధానం".  ఈ చిత్రం 05-10-1961 లో విడుదలై సంగీత పరంగా విజయం సాదించింది. నిర్మాతకు నష్టం వాటిల్లినా, కథా, పాటలు చాలా బాగున్న చిత్రంగా చెప్పుకోవచ్చు. శ్రీ ఆచార్య ఆత్రేయ నిర్మించి, దర్సకత్వం వహించిన  చిత్రం. అక్కినేని, కృష్ణకుమారి, నాగయ్య, గుమ్మడి, రేలంగి, చలం, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, నటించిన భారీ తారాగణ చిత్రం. ఆత్రేయ స్వయానా రచయిత అయినా, శ్రీ శ్రీ, దాశరథి, ఆరుద్ర లతో పాటలు వ్రాయించి, తన సౌజన్యత ను చాటు కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు.  అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్ చేసారు.  వాటిల్లో శ్రీ శ్రీ వ్రాసిన హరికథ "శ్రీ నగజా తనయం సహృదయం" ఘంటసాల మాస్టారు చే పాడించి చిత్రానికే వన్నె తెచ్చారు. ఘంటసాల గారు హరికథను అద్భుతంగా గానం చేసి ప్రాణం పోశారు.  ఇక్కడ రేలంగి హరికథ చెప్పుతుంటే, అక్కడ నాయిక, నాయకుణ్ణి ఓర చూపులు చూడడం, గుర్రం బండి గుంతలో దిగబడితే, నాయకుడు దాన్ని బయటకు నెట్టడం మొదలగు నవి దర్శకుని ప్రతిభకు తార్కాణం. హరికథలో వినిపించిన మాటలు కూడా ఘంటసాల గారివే. ఇప్పుడు హరికథ విందాం, ఘంటసాల గాత్రాన్ని విని ఆనందిద్దాము.


Wednesday, June 5, 2013

"పొగరుబోతు పోట్లగిత్తర". ("నమ్మినబంటు")


Nammina Bantu.JPG
 శంభూ ఫిల్మ్స్ బ్యానర్ లో శ్రీ యార్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించిన చిత్రం "నమ్మినబంటు". ఈ చిత్రం 07-01-1960 లో విడుదలైంది.  దర్సకత్వం శ్రీ ఆదుర్తి సుబ్బా రావు, సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు, మాస్టర్ వేణు. అక్కినేని, సావిత్రి, S V రంగా రావు, గుమ్మడి, రేలంగి నటించారు.  ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి రజత పతకం అందుకొన్న చిత్రం. సావిత్రిని ఉడికిస్తూ అక్కినేని పై చిత్రీకరించిన పాట "పొగరుబోతు పోట్లగిత్తర". ఘంటసాల మాస్టారు ఎంతో ఉషారుగా పాడారు. గీత రచన కొసరాజు (?) ఆ పాట విందాం,  వీడియో క్లిప్పింగ్ చూద్దాం. పాట నిడివి 3 నిమిషాల 40 సెకండ్లు

Sunday, June 2, 2013

" పాడవేల రాధిక ప్రణయ సుధా గీతికా"


అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన చిత్రం " ఇద్దరు మిత్రులు".  ఈ చిత్రం 29-12-1961 లో విడుదలై సంచలన విజయం సాదించింది.  అక్కినేని ద్విపాత్రాభినయం, గుమ్మడి, రాజసులోచన, E. V . సరోజ, శారద, పద్మనాభం, రమణా రెడ్డి, రేలంగి, సూర్యకాంతం, G వరలక్ష్మి మొదలగు వారు నటించగా, ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వం వహించారు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు సంగీతం చిత్రానికే వన్నె తెచ్చింది. అన్ని పాటలు సూపర్ డూపర్  హిట్స్ . అన్నపూర్ణ వారి చిత్రంలో వీణ పాట తప్పక ఉంటుంది.  P సుశీల గారు పాడిన " పాడవేల రాధిక ప్రణయ సుధా గీతికా" మంచి మెలోడీ పాట.  అయితే పాట చివర ఘంటసాల గారు ఒకే చరణం "ప్రణయ సుధా గీతికా పాడవేల రాధిక" తో పాట ముగించడం అద్భుథమ్. గీత రచన శ్రీ శ్రీ .